గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు సోమవారం శాసనమండలిలో ప్రసంగించారు.
అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర శాసనసభ స్థానాలు పెంచుతామని హామీ ఇచ్చారని.. కానీ కేంద్ర ప్రభుత్వం అది కూడా పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. దానిపై గట్టిగా అడిగితే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల సెంటిమెంట్కు భయపడి డబ్బులివ్వలేమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అదే సెంటిమెంట్తో తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.