సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తన కంటే జూనియర్ అని, అయినా ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి సార్.. సార్ అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడానని సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో శనివారం సుదీర్ఘంగా జరిగిన రెండో అఖిల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు కోసం వెంపర్లాడలేదని, మోదీ తనంతట తాను వచ్చి ఏపీకి అన్యాయం జరిగిందని సానుభూతి చూపారని చెప్పారు. ఉమ్మడిగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని ఆయన ప్రతిపాదించడం వల్లే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు. ఆనాడే తాము బయటికి వచ్చి ఉంటే మరిన్ని వేధింపులుండేవని, అందుకే ఇన్నాళ్లూ సంయమనంతో ఆగామని తెలిపారు.