చంద్రబాబు అవినీతి కుంభకర్ణుడు: విజయసాయిరెడ్డి

16 Apr, 2018 16:44 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వంద వైఖరితో ప్రత్యేక హోదా రాదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబును బకాసురుడితో పోల్చవచ్చు అంటూ విమర్శించారు. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్వప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును తాకట్టుపెట్టిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబు, అవినీతిలో కుంభకర్ణుడిని తలపిస్తున్నారంటూ మండిపడ్డారు. 

రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహస్యం చేసే తీరు చూస్తే, ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు పుట్టారని రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్‌ సైతం బాధపడేవారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని, అది విజయవంతమైన బంద్‌లో కనిపించిందని అన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు బంద్‌లో పాల్గొన్న వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలకు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు