అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రచారం చేయండి

5 Oct, 2017 00:56 IST|Sakshi

వైఎస్సార్‌సీపీపై టీడీపీ నేతలకు సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం జరుగుతున్న తీరుపై బుధవారం  చంద్రబాబు తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఉపాధి హామీ పనులను కార్మికులతో కాకుండా యంత్రాలతో చేయిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సీఎం వివరించారు.యంత్రాలతో చేయిస్తున్నా మన్న విషయాన్ని పక్కనపెట్టి.. వైఎస్సార్‌సీపీ వల్లే ఉపాధి హామీ పథకం నిధులు రాలేదని ప్రచారం చేయాలని సూచించారు. 

కొత్త నాయకులు వస్తారని హెచ్చరిక
‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం కొన్ని నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా జరగడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగా లేకపోతే రాజకీయ భవిష్యత్‌ ఉండదని, వారి స్థానంలో కొత్త నాయకులు వస్తారని హెచ్చరించారు. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌లు అన్ని నియోజకవర్గాల్లో కార్య క్రమం ఎలా జరుగుతుందో రోజూ తెలుసు కోవాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు రేషన్‌ షాపుల్లో చక్కెర, కిరోసిన్‌ అందడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారని పలువురు నేతలు చెప్పగా బాబు పరిశీలిద్దామంటూ జవాబిచ్చారు. 

మరిన్ని వార్తలు