టీఆర్‌ఎస్‌ పాలన అబద్ధాలమయం: రమణ్‌సింగ్‌ 

2 Dec, 2018 02:47 IST|Sakshi

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో మూడు సార్లు విజయం సాధించిన బీజేపీ నాలుగవ సారి కూడా విజయం సాధిస్తుందని ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రమణ్‌సింగ్‌ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ పాలన సాగిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతల చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి సేవా ధృక్పథం కలిగిన వ్యక్తి చట్టసభల్లో ఉండాలన్నారు.  ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే అని అన్నారు. అనంతరం చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, రామన్‌గౌడ్, ప్రేమ్‌రాజ్‌  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు