‘సొంత ప్రయోజనాల కోసమే కూటమి’

11 Jan, 2019 17:46 IST|Sakshi
యోగి ఆదిత్యానాథ్‌ (ఫైల్‌ ఫోటో)

లక్నో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో ఏర్పడిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)ల కూటమిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వారి సొంత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే ఎస్పీ, బీఎస్పీలు కూటమి కట్టాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల చరిత్ర ప్రజలకు బాగా తెలుసనీ, ప్రజలు ఆలోచించాకే ఓటు వేస్తారని పేర్కొన్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ 50-50 ఫార్ములాతో సీట్ల ఒప్పందం కుదర్చుకున్న విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం లక్నోలో యోగి మాట్లాడుతూ.. గత ఎన్నికల ఫలితాలే 2019లో కూడా పునారావృత్తం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 73 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా ఎస్పీ, బీఎస్పీ మధ్య సీట్ల ఒప్పందంపై నెలక్రితం నుంచే వార్తలు వినిపిస్తున్నా.. దీనిపై అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన మాత్రం చెయ్యలేదు.

ఈ నేపథ్యంలో వారిద్దరూ (రేపు) శనివారం ఉమ్మడి మీడియా సమావేశంలో కూటమి గురించి ప్రకటించే అవకాశం ఉంది. ఎస్పీ, బీఎస్పీకి తోడుగా రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ) అధినేత అజిత్‌ సింగ్‌ కూడా జతకట్టారు. అజిత్‌ ఇటీవల అఖిలేష్‌తో సమావేశమై కూటమిపై చర్చించారు. కాగా యూపీలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమికి ఏర్పాటు చేస్తున్నట్లు మాయావతి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు