అగ్రిగోల్డ్‌ ఆస్తులు దోచుకున్నవారికి శిక్ష తప్పదు: అప్పిరెడ్డి

19 Oct, 2019 16:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఎన్నికల హామీ అమలులో భాగంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో రూ.270 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 3లక్షల 70వేలమందికి లబ్ది చేకూరుతుంది. చంద్రబాబు నాయుడుకు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన రాలేదు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో  కుమ్మక్కై బాధితులకు అన్యాయం చేశారు. గత ప్రభుత్వం కమిటీలు వేసి కాలక్షేపం చేసింది.  చంద్రబాబు తీరు వల్ల 300మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా చిన్న చిన్న కుటుంబాలకు చెందినవారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం చేయాలని సీఎం ముందుకు వచ్చారు. రూ.10 వేల నుంచి రూ.20వేలు లోపు డబ్బులు కట్టిన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు అందరికీ డబ్బులు చెల్లిస్తాం. దీనివల్ల మరో పది లక్షల మంది బాధితులకు లబ్ధి చేకూరుతుంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను టీడీపీ నాయకులు దోచుకున్నారు. ఆస్తులను దోచుకున్నవారికి శిక్ష తప్పదు.అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌లాండ్‌ను నారా లోకేశ్‌ కాజేయాలని చూశారు. ఇంకా టీడీపీ నేతల చేతుల్లోనే అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం.

చదవండి: అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల

మరిన్ని వార్తలు