ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు ప్రవర్తన!

23 Jul, 2019 11:09 IST|Sakshi

ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితోనే...

సభ కార్యకలాపాలకు అడ్డు పడుతున్నారు

ప్రతిపక్ష నేత తీరును ఎండగట్టిన సభా నాయకుడు

వైఎస్సార్‌ చేయూత పథకంపై విస్పష్ట వివరణ

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ  సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుండటంతో తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఆక్రోశంతో, ఈర్ష్యతో చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు చూపిస్తున్న పేపర్‌ కటింగ్‌ను స్వయంగా పరిశీలించి.. దానిపై సభా నాయకుడు వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్‌ కటింగ్‌ 18-10-2017నాటిదని, ఈ అంశం మీద స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్‌ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఏ నేపథ్యంలో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రకటించామో కూడా పాదయాత్రలోనే వివరంగా ప్రజలకు తెలిపినట్టు వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా కనీసం ఓ పది సమావేశాల్లో ఈ విషయమై స్పష్టంగా ప్రజలకు చెప్పామన్నారు. రెండు నెలలపాటు జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ వివరంగా చేర్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అధికకారంలో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాము అధికారం‍లోకి వచ్చిన వెంటనే బడుగు, బలహీనవర్గాల గురించి ఆలోచించామని, మొట్టమొదటి శాసనసభలోనే వారి గురించి చరిత్రాత్మక చట్టాలను తీసుకొస్తున్నామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నామినేషన్‌ పనుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పునరుద్ఘాటించారు. అందులోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ.. 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించామని వెల్లడించారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దుర్బుద్ధితో చంద్రబాబు నిన్నటి నుంచి సభను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. 

చదవండి :

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

 అబద్ధాలు ఆడటం మాకు తెలియదు: సీఎం జగన్‌

అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

మరిన్ని వార్తలు