ఔట్‌సోర్సింగ్‌: టీడీపీ పచ్చి అబద్ధాలు చెప్తోంది

17 Dec, 2019 10:59 IST|Sakshi

లంచాలకు తావు లేకుండా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు

అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల విషయంలో టీడీపీ సభ్యులు చేస్తున్న రాద్ధాంతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభలో పచ్చి అబద్ధాలు చెప్తోందని ఆయన మండిపడ్డారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేసే గొప్ప ఆలోచనతో ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సౌర్సింగ్‌ సర్సీసెస్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఆఖరికీ ఉద్యోగులు జీతాలు పొందాలన్న లంచం ఇవ్వాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి ఉండకూడదని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నష్టపోకూడదని, వారికి పూర్తి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

గత చంద్రబాబు హయాంతో ఆయన బంధువు భాస్కర్‌ నాయుడికి ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ గుర్తు చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు సంబంధించిన వాళ్లకే గత హయాంలో ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులు ఇచ్చి ఇష్టానుసారంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా, వారికి పూర్తిగా లబ్ధి చేకూర్చేందుకు, లంచాలకు తావులేకుండా పూర్తి జీతాలు అందించేందుకు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చే సదుద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను తీసుకొచ్చామని, ఈ విషయంలోనూ టీడీపీ బురద జల్లుతూ, రాజకీయం చేస్తూ.. దిక్కుమాలిన అబద్ధాలు చేస్తోందని సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు