కఠ్మాండు: నేపాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డిసెంబర్ చివరినాటికి తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కమ్యూనిస్ట్ పార్టీల కూటమి ప్రకటించింది. ఇటీవల జరిగిన చరిత్రాత్మక ఎన్నికల్లో ఈ కూటమిలోని సీపీఎన్– యూఎంఎల్, సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ పార్టీలు స్పష్టమైన మెజారిటీ సాధించిన నేపథ్యంలో.. కూటమి అధికార ప్రతినిధి బిష్ను రిజాల్ మంగళవారం ఈ ప్రకటన చేశారు.
మొత్తం 275 స్థానాల పార్లమెంటులో 165 స్థానాలకు ప్రత్యక్షంగా, 110 స్థానాలకు ప్రాతినిధ్య ఓటు విధానంలో ఎన్నికలు జరిగాయి. ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీల కూటమి 113 సీట్లు గెలిచింది. ఇందులో సీపీఎన్–యూఎంఎల్ 77 సీట్లను, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ 36 స్థానాలను గెలుచుకున్నాయి. అధికార నేపాలీ కాంగ్రెస్ 21 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది.