బీజేపీ నేత బండారు దత్తాత్రేయ
సాక్షి, వికారాబాద్: వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాలులో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్కు రాష్ట్రంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీలతో సీట్ల సర్దుబాటుకు వెనకాడబోమన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగు నీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలు ఏ ఒక్కటీ పూర్తి కాలేదని ఆరోపించారు. బయ్యారం స్టీల్ ప్లాంటు, పాల్వంచ ఫ్యాక్టరీకి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రం నుంచి స్పందనలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త పరిశ్రమలు స్థాపించ లేదని, కొందరు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నా ప్రభుత్వ పోత్సాహమేమీ లేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఓ భ్రమిత్ షా అంటూ కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించా రు. కేటీఆర్కు, టీఆర్ఎస్ నేతలకు మతి భ్ర మించి మాట్లాడుతున్నారని అన్నారు. అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిపై నిలదీస్తే.. సమాధానం చెప్పలేక మాటలతో దాడులకు దిగుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.