‘రెండు సీట్లకూ ఒకేసారి ఉపఎన్నికలు పెట్టండి’ 

18 Jun, 2019 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ : గుజరాత్‌లో ఇటీవల ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు వేరుగా ఉపఎన్నికలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గుజరాత్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత పరేష్‌భాయ్‌ ధనానీ ఈ కేసు వేస్తూ, ఈ రెండు స్థానాలకూ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కోరారు. పరేష్‌భాయ్‌ పిటిషన్‌ను కోర్టు అత్యవసరంగా మంగళవారం విచారించే అవకాశం ఉంది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, అక్రమం, చట్ట ఉల్లంఘన, నియంతృత్వ విధానమని పరేష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌తోపాటు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లకు ఒకేసారి ఉప ఎన్నికలను నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.  

మరిన్ని వార్తలు