దేశమే నా తల్లి, తండ్రి

10 Dec, 2017 04:16 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత నిజామీ ట్వీట్లకు ప్రధాని మోదీ జవాబు

లూనావాడా/బోడేలి: దేశమే తనకు తల్లి, తండ్రి అని..దేశ సేవలోనే తుదిశ్వాస విడుస్తానని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ముత్తాత నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుడంటూ ట్వీట్‌ చేసిన కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ నిజామీ.. ప్రధాని మోదీ తల్లిదండ్రులెవరంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్లపై మహిసాగర్‌ జిల్లా లూనావాడాలో జరిగిన ర్యాలీలో మోదీ విరుచుకుపడ్డారు. కశ్మీర్‌కు చెందిన నిజామీ.. ఆజాద్‌ కశ్మీర్‌ కోసం డిమాండ్‌ చేశాడని, అక్కడి భారత సైన్యాన్ని రేపిస్టులని ఆరోపించాడని అన్నారు. పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్‌ గురును అమరుడంటూ కీర్తించిన ఘనత నిజామీది అని దుయ్యబట్టారు. అఫ్జల్‌ గురును ఉరి తీసిన తర్వాత ఇంటింటికీ ఒక అఫ్జల్‌ తయారు కావాలని ప్రసంగించాడని ఆరోపించారు. .

పటీదార్లకు రిజర్వేషన్‌ హామీ
ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్‌ ఇస్తున్న హామీని నమ్మవద్దని పటీదార్లను మోదీ కోరారు. పటీదార్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత వేస్తారా..లేక మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ హామీ ఇచ్చి వదిలేస్తారా అని  కాంగ్రెస్‌ను నిలదీశారు. ఏ రాష్ట్రంలోనైనా ముస్లింలకు రిజర్వేషన్లు అమలయ్యాయా అని ప్రశ్నించారు.

బీసీలు పనికిరాని వారా?
అయ్యర్‌ ట్వీట్లను మోదీ ప్రస్తావించారు. చోటా ఉదయ్‌పూర్‌ జిల్లా బోడేలిలో మాట్లాడుతూ.. వెనుకబడిన కులంలో పుట్టినందుకే తనను ‘నీచ్‌’అంటూ విమర్శించారన్నారు.  వెనుకబడిన వర్గాల వారంతా పనికిరాని వారని అనుకుంటున్నారా అని అడిగారు. ఎన్నికలు జరిగిన ప్రతీచోటా ఓడిన కాంగ్రెస్‌ తనను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. తనను ఓడిస్తే ప్రధాని పదవి ఖాళీ అవుతుందని, యువరాజు(రాహుల్‌)ను గద్దెపై కూర్చోబెట్టవచ్చనే ఆశతో ఉందన్నారు.

మరిన్ని వార్తలు