మూకోన్మాదం, కథువాపై రచ్చ

24 Jul, 2018 02:53 IST|Sakshi
బాలగంగాధర్‌ తిలక్‌ జయంతి సందర్భంగా పార్లమెంటు హాల్‌లో ఖర్గే, రాజ్‌నాథ్‌ నవ్వులు

సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

రాఫెల్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలు

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఇటీవల జరిగిన మూకోన్మాద ఘటనపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్‌ఎంపీ కరణ్‌ సింగ్‌ రాజస్తాన్‌లో ఇటీవలి కాలంలో జరిగిన నాలుగో మూక హత్య ఇదని పేర్కొన్నారు. దీని వెనక గోరక్షకుల హస్తముందన్నారు. దీనిపై బీజేపీ మండిపడింది. పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి కాంగ్రెస్‌ ఎంపీ ప్రసంగానికి అడ్డుతగలడంతో వాగ్వాదం జరిగింది. అంతకుముందు, కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కథువా ఘటనను, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే
ఉన్నావ్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.

రాహుల్‌పై హక్కుల ఉల్లంఘన
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో రాఫెల్‌ ఒప్పందంపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలంటూ బీజేపీ ఎంపీలు పెట్టిన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు. రాఫెల్‌ ఒప్పందంలో బూటకపు జాతీయవాదం చాటున నక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ విమర్శించారు. కాగా, యూపీఏ హయాంలో కోట్‌ చేసిన దానికంటే 9 శాతం తక్కువకే  తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. గృహ కొనుగోలుదారులకు సాధికారత కల్పించేలా దివాళా చట్టం – 2018లో ప్రభుత్వం తీసుకురానున్న సవరణలను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎంపీలు ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు అడిగేలా, నోటీసులిచ్చేలా ‘ఈ–నోటీసెస్‌’ యాప్‌ను ప్రారంభించారు. అటు, చెక్‌ బౌన్సుల కేసులో త్వరగా విచారణ జరిగే నెగోషియేబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (సవరణ) బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.  ఇలాంటి కేసుల విచారణలో చెక్‌ ఇచ్చిన వ్యక్తి ముందుగా చెక్‌ మొత్తంలో 20శాతాన్ని పరిహారంగా చెక్‌ తీసుకున్న వ్యక్తికి ఇవ్వాలి.
 

మరిన్ని వార్తలు