రాజ్‌బబ్బర్‌ స్థానం మార్పు

24 Mar, 2019 04:51 IST|Sakshi

యూపీ నుంచి మరో 9 మందితో కాంగ్రెస్‌ జాబితా

లక్నో: ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజ్‌బబ్బర్‌ ఫతేపూర్‌సిక్రీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో ఆయనకు పార్టీ మొరాదాబాద్‌ స్థానాన్ని కేటాయించింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఏడవ జాబితా విడుదలచేసింది. ఉత్తరప్రదేశ్‌లో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజ్‌బబ్బర్‌కు మొదట కేటాయించిన మొరాదాబాద్‌ నుంచి ప్రస్తుతం ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్యిహా పోటీ చేయనున్నారు. రాజ్‌బబ్బర్‌ 1999, 2004లో ఆగ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకారం రాజ్‌బబ్బర్‌ మొరాదాబాద్‌ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని తెలిసింది. నసీముద్దీన్‌ సిద్దిఖీ ప్రస్తుతం బిజ్నోర్‌నుంచి పోటీలో దిగుతున్నారు.. ప్రకటించిన పేర్లలో బరేలీ నుంచి ప్రవీణ్‌ అరోన్‌ కూడా ఉన్నారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానంనుంచి విజయం సాధించారు. అలాగే బందా నుంచి బాల్‌కుమార్‌ పటేల్‌ బరిలో ఉన్నారు. దశాబ్దం క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన బందిపోటు శివకుమార్‌ అలియాస్‌ దదువాకు పటేల్‌ సోదరుడు. పటేల్‌కూడా గతంలో సమాజ్‌వాది పార్టీ నుంచి మీర్జాపూర్‌ నుంచి విజయం సాధించారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

మరిన్ని వార్తలు