కాంగ్రెస్కు తలనొప్పిగా మారనున్న అభ్యర్థుల ఎంపిక
జాబితా ప్రకటన తర్వాత రంజుగా మారనున్న రాజకీయం
ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురి మధ్య పోటీ
ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారి సహకారం డౌటే!
ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఆరు చోట్ల తిరుగుబాటు?
గ్రేటర్ పరిధిలో కూటమితో కొత్త చిక్కులు
30-40 స్థానాల్లో రెబెల్స్ బరిలో ఉండే అవకాశం
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీలో తుపాను ముందు ప్రశాంతత కనిపిస్తోంది. ఓ వైపు కూటమి పార్టీలతో పొత్తు విషయం కొలిక్కిరాక సతమతమవుతుంటే.. మరోవైపు, ఎన్నికల బరిలో దిగడంపై కాంగ్రెస్ నేతల్లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. పోటీ చేసే అభ్యర్థుల ఖరారు జాబితాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. తిరుగుబాటు తుట్టెను కదిపేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరగడమే ఆలస్యం.. రెబెల్స్గా పోటీచేసేందుకు, ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు.. ఖరారైన అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్కు మున్ముందు ముసళ్ల పండుగ తప్పదనిపిస్తోంది. దాదాపు 30–40 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని.. 30 చోట్ల రెబెల్స్ బెడద తప్పకపోవచ్చని పార్టీ ముఖ్యనేతలే చెబుతుండటం గమనార్హం.
అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్లో టికెట్ ఆశించే నేతల సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశిస్తారు. కొన్నిచోట్ల పోటీచేసే సామర్థ్యమున్న నాయకులు ఐదు మంది కూడా ఉంటారు. అయితే, ఈసారి కూడా అందుకు భిన్నమైన పరిస్థితులేమీ కనిపించడం లేదు. మొత్తం రాష్ల్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ.. వెయ్యికి పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. గరిష్టంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి 30 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇప్పుడిప్పుడే అసమ్మతి ఛాయలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఒకవేళ అనుకున్నది జరక్కపోతే ఏంచేయాలనే దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు గానూ.. టికెట్లు ఎవరికి వచ్చినా ఆరు చోట్ల రెబల్స్ బరిలో దిగే అవకాశముందన్న సమచారం కాంగ్రెస్ పెద్దల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ వంటి టీఆర్ఎస్కు పట్టున్న జిల్లాల్లో అసమ్మతి బెడద కనిపిస్తుండడంతో టీపీసీసీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పార్టీ బలంగా ఉందని భావిస్తున్న మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ అసమ్మతి, అసంతృప్తి స్పష్టంగానే బహిర్గతం కానున్నాయి.
గ్రేటర్లో ‘కూటమి’ కట్టేనా?
గ్రేటర్ హైదరాబాద్లో కూటమిలో భాగంగా టీడీపీ, టీజేఎస్లకు ఎన్ని టికెట్లు ఇస్తారన్న స్పష్టత రాకపోవడంతో పరిస్థితి గందరగళంగా ఉంది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు ఇస్తారా.. కాంగ్రెస్ పోటీచేస్తుందా అన్నది తేలలేదు. సనత్నగర్, ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాల్లోనూ కొంత గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో.. కనీసం 40 స్థానాల్లో రగలనున్న అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లబరచాలన్నది కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వారిలో నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమేననే పైకి చెబుతున్నప్పటికీ.. ఈసారి అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు పేర్కొనడం గమనార్హం.
బలమైన నేతలు ‘రెబల్స్’ అయ్యే అవకాశాలున్న స్థానాలు: