ప్రాంతీయ పార్టీలతో పట్టువిడుపులు

3 Jun, 2018 02:57 IST|Sakshi

కాంగ్రెస్‌ కొత్త వ్యూహం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల సహాయంతో 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదిరించాలనే వ్యూహానికి కాంగ్రెస్‌ పదునుపెడుతోంది. ప్రాంతీయ పార్టీకి స్వేచ్ఛనిచ్చినట్లు చూపించడం ద్వారా పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక శక్తులైన ప్రాంతీయ పార్టీలను కూడగట్టాలనేది కాంగ్రెస్‌ ఆలోచన. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోవడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. అయితే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో పార్టీ నేతల్లో అసంతృప్తిని అర్థం చేసుకోవడం, పార్టీ ప్రయోజనాలకోసం వారికి నచ్చజెప్పడం రాహుల్‌ గాంధీ ముందున్న పెద్ద సవాల్‌.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందే కూటములు ఏర్పాటు చేసుకోవాలంటూ రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఇందులో భాగంగానే ఢిల్లీతోనే ఈ పొత్తులు మొదలుపెట్టాలని నిర్ణయించారు.  ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు గానూ.. కాంగ్రెస్‌ 4, ఆప్‌ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో బలహీనంగా ఉన్నందున ఎస్పీ, బీఎస్పీలతో సీట్ల విషయంలో ఆ పార్టీ పట్టుబట్టకపోవచ్చని సమాచారం.

మరిన్ని వార్తలు