దేవెగౌడ ఓటమికి కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కుట్ర..!

1 Jun, 2019 17:09 IST|Sakshi

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమికి కాంగ్రెస్‌ నేతలు బీజేపీ సహరించారంటూ వస్తున్న వార్తలు కన్నడనాట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని తూమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌-కాంగ్రెస్‌ అభ్యర్థిగా దేవెగౌడ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి జీఎస్‌ బసవరాజు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే దెవెగౌడ ఓటమికి కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కేఎన్‌ రాజన్‌ కుట్ర పన్నారని.. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఆరోపిస్తోంది. దేవెగౌడను ఓడించడానికి బసవరాజుకు అధిక మొత్తంలో డబ్బు పంపారని, పార్టీ అంతర్గత విషయాలను బీజేపీ నేతలకు చేరవేశారని తూమకూర్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ రామకృష్ణ సంచలన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు కేసీ వేణుగోపాల్‌కు ఆయన లేఖ రాశారు.

రాజన్‌ కారణంగానే దేవెగౌడ ఓటమి చెందారని, వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కాంగ్రెస్‌ నేతలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌, కాంగ్రెస్‌ మంచి ప్రభావం చూపినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దారుణ ఓటమిని మూటగట్టుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో సునాయసంగా విజయం సాధించింది. జేడీఎస్‌ కేవలం  ఒక్క స్థానానికే పరిమితమైంది.  

మరిన్ని వార్తలు