‘కేసీఆర్‌ రైతు బంధు కాదు.. రాబందు’

17 Oct, 2018 16:33 IST|Sakshi
దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు! రైతు బంధు కాదని, రాబందని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వటం లేదని, అందుకే కేసీఆర్‌.. ప్రజల తిరుగుబాటు నుంచి దృష్టి మరల్చేందుకు మరోసారి సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్లే టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. 

కేసీఆర్‌ నాలుగేళ్లుగా నిరుద్యోగులను మోసం చేసింది నిజం కాదా అని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగి ఉంటే.. ఈ నాలుగేళ్లు కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారాయన. కేసీఆర్‌ అందరిని బ్లాక్‌మేయిల్‌ చేస్తున్నారని అన్నారు. 21 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ అర్హులు ఉంటే.. ఎంత మందికి కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్ళను మరోసారి కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ సీఎం వ్యాఖ్యలను ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని, ఈసీ సుమోటోగా తీసుకుని కేసులు పెట్టాలని కోరారు. 

మరిన్ని వార్తలు