రేపు బీజేపీలో చేరుతున్నా : పొంగులేటి

31 Mar, 2019 14:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్ నేత‌, ఏఐసీసీ మాజీ సెక్రటరీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కమళం గూటికి చేరుతారని గతకొంత కాలంగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. బీజేపీలో రేపు అధికారికంగా చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానాలు జరిగాయని అన్నారు.

‘నేను చేసిన పనికి కాంగ్రెస్‌లో 20% ఫలితమే దక్కింది. కాంగ్రెస్ కమర్షియల్ పార్టీ మారిపోయింది. ఇటీవల ఆ పార్టీలో దళారులు కీలక పాత్ర పోషిస్తున్నారు.  నాలాంటి విధేయులకు కాంగ్రెస్ పార్టీలో తగిన స్థానం లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీ చేద్దామంటే డబ్బులున్నాయా అని అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడినా మళ్లీ అదే నాయకత్వానికి లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని టీపీసీసీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బలమైన నాయకత్వంలో పని చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నా. 1993 నుంచి నరేంద్ర మోదీతో నాకు పరిచయం ఉంది. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పనిచేస్తా’ అన్నారు. కాగా, కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కక్కొరూ టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో తలలు పట్టుకుంటున్న అధిష్టానం.. ఏళ్లుగా పార్టీకి విధేయంగా ఉన్న సీనియర్లు సైతం హ్యాండివ్వడంతో తెలంగాణలో ఆ పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితి నెలకొంది.

(చదవండి : కాంగ్రెస్‌కు పొంగులేటి రాజీనామా!)

మరిన్ని వార్తలు