ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: పొన్నం ప్రభాకర్‌

24 Jul, 2018 12:58 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

టీఆర్‌ఎస్‌ నేతల్లారా తరిమికొడుతారు జాగ్రత్త

కేసీఆర్‌కు మంత్రి పదవీ ఇస్తే తెలంగాణ ఉద్యమం ఉండేదా

విభజన, తెలంగాణ హక్కులపై మౌనమేలా..?

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ 

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ  పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో శిఖండి పాత్ర పోషించిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. సోమవారం అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని తీరు మారకుంటే ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని స్పష్టం చేశారు. అనాడు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని మనోహ్మన్‌సింగ్‌ సమక్షంలో అంగీకరించారని తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హమీలు, తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన టీఆర్‌ఎస్‌ నేతలు మతిభ్రమించి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీలో విలీనం చేసే సమయంలో కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదని, తెలంగాణ పౌరుషాన్ని తాకట్టు పెట్టి టీఆర్‌ఎస్‌ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన హమీలపై పోరాడకుండా కాంగ్రెస్‌ను నిందించడం తగదన్నారు.

రాజశేఖర్‌రెడ్డి హాయంలో తాము తెలంగాణ కోసం పోరాటం చేశామని చరిత్ర మరిచి మాట్లాడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తే కేసీఆర్‌ తెలంగాణ కోసం పోరాడి ఉండేవాడా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టి హరీశ్‌రావు ఉద్రేకపరిచి ఆత్మహత్యలకు పురిగొల్పారని ఆరోపించారు. నాయకులు మాజీ మేయర్‌ డి.శంకర్, కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, వేదం, ముక్క భాస్కర్, దండి రవీందర్, ములుగు ప్రకాష్, సుంకరి గణపతి, పొన్నం శ్రీనివాస్‌గౌడ్, కటుకం వెంకటరమణ, వీరారెడ్డి, దేవేందర్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు