సోనియా దయ వల్లే తెలంగాణ ఏర్పాటు

7 Oct, 2018 14:23 IST|Sakshi
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ ఏర్పాటు అయిందని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా వ్యాక్యానించారు. ఆదివారం ముషీరాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్‌ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌సీ కుంతియాతో పాటు కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల బలిదానం చూసి చలించి సోనియా తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో తెలంగాణ ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ 9 నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్‌ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని సూటిగా అడిగారు. మోదీ, ఎన్‌డీఏ గ్రాఫ్‌ తగ్గుతోంది..రాహుల్‌ గ్రాఫ్‌ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మోదీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకుని కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ..హైదరాబాద్‌ని అన్నిరంగాల్లో అభివృద్ధిని చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ పిట్టలదొర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాటలే చెబుతాడు తప్ప..చేతలుండవన్నారు. 

ఏఐసీసీ నేత బోసురాజు మాట్లాడుతూ..గ్రేటర్‌ హైదరాబాద్‌కు సెపరేట్‌గా మేనిఫెస్టో సబ్‌ కమిటీ వేస్తామని తెలిపారు. గ్రేటర్‌ సమస్యలపై సబ్‌కమిటీ చర్చిస్తుందన్నారు. 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

అంజన్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెస్సేనని, తెలంగాణాకు అందరూ సపోర్ట్‌ చేసినా అసదుద్దీన్‌ ఓవైసీ తెలంగాణ వద్దన్నారని విమర్శించారు. గ్రేటర్లో 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు