కామారెడ్డి: తెలంగాణ మంత్రి, సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ ఈ ఎన్నికల్లో గెలవకపోతే సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారని, ఆ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ..తాను గెలవకపోతే సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరారు. సవాల్కు కేటీఆర్ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మహాకూటమి ఏర్పడిందని, కేసీఆర్ అహంకార పాలనను గద్దె దించడమే మహా కూటమి లక్ష్యమని వెల్లడించారు.
తండ్రీ కుమారులిద్దరూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ గత ఎన్నికల సమయంలో చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పారని, అయితే ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని సూటిగా అడిగారు. హైదరాబాద్లో అంతా గుంతలమయం అయిన రోడ్లే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణాను బంగారు తెలంగాణాగా మారుస్తామని చెప్పి వారి కుటుంబాన్నే బంగారు కుటుంబంగా చేసుకున్నారని మండిపడ్డారు.