రాహుల్‌పై పోటీగా కాంగ్రెస్‌ నేత కుమారుడు

26 Mar, 2019 14:55 IST|Sakshi

లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. రాహుల్‌ గాంధీ పోటీ చేయబోయే అమేథీ నియోజకవర్గం నుంచి ఆయనకు పోటీగా కాంగ్రెస్‌ నేత కుమారుడు బరిలోకి దిగనున్నారు. యూపీకి చెందిన హజీ సుల్తాన్ ఖాన్ గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నారు. 1991పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ, 1999లో సోనియాగాంధీ పార్లమెంట్‌కు పోటీ చేసినప్పుడు వీరిద్దరిని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశాడు. కానీ ఆయన కుమారుడు హజీ హరూన్ రషీద్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు.రాహుల్‌పై పోటీగా అమేథీ నియోజకవర్గం బరిలోకి దిగుతానని రషీద్‌ ప్రకటించాడు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయం చెప్పలేదు.

ఈ సందర్భంగా రషీద్ మీడియాతో మాట్లాడుతూ..  గత 70 ఏళ్ల నుంచి అమేథీలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. పార్టీ అధిష్టానం స్థానిక నేతలను పట్టించుకోలేదని ఆరోపించారు. అమేథి నియోజకవర్గంలో 6.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని.. అవన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకమే అని పేర్కొన్నారు. అమేథి నియోజకవర్గంలో అభివృధ్ది జరగలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో తిరిగితే వాస్తవాలుతెలుస్తాయన్నారు. 

2004 సాధారణ ఎన్నికల సమయంలో అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అప్పట్నుంచి సోనియా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నియోజకవర్గంలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతాయి.

మరిన్ని వార్తలు