ఎమ్మెల్యే వనమాపై  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

6 May, 2019 06:46 IST|Sakshi
ఏఎస్సై వెంకటేశ్వరరావుకు ఫిర్యాదును అందజేస్తున్న నాయకులు

సుజాతనగర్‌: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా నాయకులు నాగా సీతారాములు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీ ఫాం పొందిన వనమా వెంకటేశ్వరరావు ఇప్పుడు పార్టీ మారి నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడన్నారు. ఒక పార్టీ నుంచి బీ ఫాం పొంది మరో పార్టీలో చేరడం అనైతికమని, తన స్వలాభం కోసమే పార్టీ ఫిరాయించాడని ఆరోపించారు.

నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను ఎలా మోసం చేస్తాడని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వనమాపై 405, 406, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతలపూడి రాజశేఖర్, తాళ్లూరి శ్రీనివాసరావు, మండల నాయకులు మడిపల్లి శ్రీనివాసరావు, పంజాల శ్రీనివాసరావు, రామ్‌లక్ష్మణ్, అజ్జూ, ఆబిద్, నరేష్, చంటి, షరీఫ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు