మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
ఆయన ఎంపీ పదవి ఓయూ విద్యార్థులు పెట్టిన భిక్ష
విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది
ఓయూ మిస్టరీ హత్యలు, లీకులపై విచారణ తప్పదు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సుమన్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామంటూనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తామని, పిచ్చిపిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. కేసీఆర్ ఎంగిలి మెతుకులు తిని, కేటీఆర్ బూట్లు నాకుతాడు. ఢిల్లీలో కవిత బ్యాగులు మోసే చరిత్ర సుమన్దని విమర్శించారు. దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, టీపీసీసీ కార్యదర్శి కేతురి వెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జేఏసీ చైర్మన్ దరవల ఎల్లయ్యలు విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటైతే దళి తుడిని ముఖ్యమంత్రిని చేసి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, సీఎం అయ్యాక సుమన్ను కాపలా కుక్కగా పెట్టుకొని ఉసిగొలుపుతున్నాడని దుయ్యబట్టారు. పెద్దపల్లి ఎంపీ పదవి ఓయూ విద్యార్థుల భిక్ష అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుమన్కు కనీసం రబ్బరు చెప్పులు కూడా లేవని, ఎవరు కనపడితే వారి దగ్గర రూ.10 అడిగేవాడని, ఎంపీ అయ్యా క చందాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలతో లక్షలు సంపాదించిన చరిత్ర సుమన్దని అన్నారు. దళితుల మీద దాడులు జరిగితే కనీసం నోరుమెదపలేని సుమన్, రేవంత్రెడ్డిపై నోరు పారేసుకోవడం స్థాయికి తగదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన హత్యలు, ఆత్మహత్యలు, ఎంసెట్ లీకులు కేసీఆర్ డైరెక్షన్లో జరిగాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విచారణ తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, అమరులు, విద్యార్థులను విస్మరించిన టీఆర్ఎస్కు తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.