స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి 

17 Apr, 2019 12:57 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి 

షాద్‌నగర్‌ టౌన్‌: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం షాద్‌నగర్‌ పట్టణంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఫరూఖ్‌నగర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సింహారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిని గ్రామ స్థాయిలోనే నాయకులు నిర్ణయించుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు స్థానిక నాయకులను సంప్రదించాలని సూచించారు.

ఏకగ్రీవంగా పార్టీ నాయకులంతా కలిసికట్టుగా ఉండి అభ్యర్థిని ఎంపిక చేయాలన్నారు. గతంలో గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం, సమాజ సేవ చేసే నాయకులకు పదవులు దక్కేవి కావని, నాయకుల వెంట తిరిగే వారికి పదవులు వచ్చేవన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని,  గ్రామ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో పీసీసీ జనరల్‌ సెక్రటరీ జగదీశ్వర్,  మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యాదయ్య యాదవ్, బాబర్‌ఖాన్, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుదర్శన్‌గౌడ్, నవాజ్‌గోరి, అంచరాములు, కాలేద్, చేగూరి రాఘవేందర్‌గౌడ్, జంగ నర్సింలు, సుదర్శన్‌గౌడ్, పైలయ్య, గంగనమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు