కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!

1 Jun, 2020 03:09 IST|Sakshi

ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో కలకలం 

వచ్చే ఎన్నికల వరకు ఉత్తమే ఉండాలని.. రేవంత్‌కు వద్దంటూ వెల్లడి 

పార్టీలో ప్రభుత్వ కోవర్టులపై మరోమారు చర్చ.. జూన్‌ 2 దీక్షలపైనా విభేదాలు 

పొన్నాల, వీహెచ్, దామోదర ప్రత్యేక భేటీపై పార్టీలో ఆసక్తికర చర్చ

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ రచ్చ మొదలయింది. టీపీసీసీ అధ్యక్ష మార్పు గురించి పార్టీ శ్రేణులన్నీ మర్చిపోయి, అధిష్టానం కూడా ఆ వైపు ఆలోచించడం లేదన్న నేప«థ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్ష మార్పు గురించిన అంశాన్ని ప్రస్తావిం చారు. ఉత్తమ్‌ను మార్చాల్సిన పనిలేదంటూనే రేవంత్‌కు ఇవ్వొద్దని ప్రతిపాదించారు. దీనికి తోడు జూన్‌ 2.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ‘దీక్ష’లపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో టీపీసీసీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పార్టీ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలను మరోమారు రసకందాయంలో పడేసింది.  

జగ్గారెడ్డి ‘స్టైలే’సెపరేటు...
2018 ముందస్తు ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. టీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు చేయడం నుంచి సొంత పార్టీ పరిణామాలపై ఆయన వ్యాఖ్యలు దుమారానికి దారి తీస్తున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారంలో ఆయన అన్న మాట లు అటు పార్టీలోనూ, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌కు మాత్రం టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని, తనను సంప్రదించకుండా ఇస్తే తన రాజకీయం తాను చేస్తానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చాల్సిన పనిలేదని, ఆయన బలమైన నాయకుడని చెప్పారు. ఉత్తమ్‌ భార్య పద్మావతిని ఎన్నికల్లో గెలిపించుకోలేనంత మాత్రా న ఆయన బలహీనుడు కాదని.. అందరినీ గెలిపిస్తానని చెప్పి తానే ఓడిపోయిన రేవంత్‌ బలవంతుడెలా అవుతాడ ని ప్రశ్నించారు. దీంతో పాటు రేవంత్‌పై తనకు కొన్ని అపోహలున్నాయని, వాటి గురించి రేవంత్‌తోనే మాట్లాడుతానన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చి ఎంపీగా గెలిచి.. అధికార పార్టీ పై పోరాటం చేస్తున్న రేవంత్‌పై జగ్గారెడ్డికి ఉన్న అపోహలేంటని, అలాంటి వ్యాఖ్యల వెనుక జగ్గారెడ్డి ఆంతర్యం ఏమిటనేది.. అంతుపట్టడం లేదు. పైగా రేవంత్‌కు టీపీసీసీ ఇవ్వద్దంటూ రాహుల్‌గాంధీకి లేఖ రాస్తానని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఉత్తమ్‌ ఉండాలంటూ.. రేవంత్‌ వద్దంటూ జగ్గారెడ్డి పేర్కొనడం కాంగ్రెస్‌ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. పార్టీలో, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా చుట్టూ ప్రభుత్వ కోవర్టులున్నారని జగ్గారెడ్డి అన్నారు. చాలాకాలంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న కోవర్టుల చర్చ జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరో మలుపు తీసుకుంది.   

వీరి భేటీ ఎందుకో?.. 
ఇక, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలకు కొందరు పార్టీ సీనియర్ల ప్రత్యేక భేటీ నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల వద్ద ధర్నా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. సీనియర్లు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన తర్వాతే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు మాత్రం ఈ నిర్ణయాన్ని విభేదిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే ఈ ముగ్గురూ శనివారం పొన్నాల నివాసంలో భేటీ అయ్యారని, ప్రాజెక్టుల వద్ద చేపట్టే దీక్షలో పాల్గొనవద్దని నిర్ణయించారని తెలుస్తోంది.
 
నా కంటే నా బిడ్డ ఎక్కువ కొట్లాడుతుంది
తన కుమార్తె జయారెడ్డికి ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. పరిస్థితిని బట్టి ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పడం లేదని, తనపై ప్రభు త్వం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడితే తన కుమార్తె రాజకీయాల్లో ఉంటుందని మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. జగ్గారెడ్డి కంటే జయారెడ్డి బాగా కొట్లాడుతుందని వివరించారు. 

మరిన్ని వార్తలు