మా జోలికి వచ్చారు.. స్వైన్‌ఫ్లూ సోకింది

18 Jan, 2019 04:08 IST|Sakshi
బీకే హరిప్రసాద్‌, అమిత్‌ షా

బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నించడం వల్లే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ సోకిందని ఎద్దేవా చేశారు. బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివచ్చారు. దీంతో అమిత్‌ షాకు జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరం కాదు.. స్వైన్‌ ఫ్లూ జ్వరం. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తే కేవలం స్వైన్‌ ఫ్లూనే కాదు.. వాంతులు, విరేచనాలు వస్తాయని అర్ధం చేసుకోవాలి’ అని అన్నారు.

దీంతో కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, పీయూష్‌గోయల్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు హరిప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. ఫ్లూ జ్వరానికి చికిత్స ఉందనీ, కానీ హరిప్రసాద్‌కున్న మానసిక అనారోగ్యాన్ని తగ్గించడం కష్టమని గోయల్‌ విమర్శించారు. ఈ విషయమై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. బీజేపీ నేతల అనారోగ్యాన్ని కాంగ్రెస్‌ కోరుకోదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైట్లీ కోలుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ట్వీట్‌చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అమిత్‌ స్వైన్‌ఫ్లూ జ్వరంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం చేరిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు