అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారు?

6 Aug, 2019 13:13 IST|Sakshi

ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను కూడా తీసేస్తారా

ఏపీ అసెం‍బ్లీ అభిప్రాయం తీసుకుని విభజించాం

ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగిస్తోంది: మనీష్ తివారి

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సభలో చర్చలో భాగంగా బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యుడు మనీష్‌ తివారి.. కశ్మీర్‌ విభజించిన తీరు సరిగా లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనపై ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించినట్లు ఆయన గుర్తుచేశారు. అలాగే కశ్మీర్‌ను విడగొట్టాలి అనుకున్నప్పుడు రాష్ట్ర శాసనసభ అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధమైన ఎలాంటి విధానాలను కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాటించలేదని విమర్శించారు. రాష్ట్రాల ఏర్పాటులో యూపీయే ప్రభుత్వం ఏకాభిప్రాయం మేరకు నడుకుందని, బీజేపీ ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొన్ని సంస్థానాలు స్వతంత్రగా ఉన్నాయని, నాటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ చొరవతోనే అవన్ని దేశంలో విలీనమయ్యాయని తివారి చెప్పుకొచ్చారు. అయితే  జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్‌ 370ని తీసివేయడం సరికాదన్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను కూడా ఇలానే తీసేస్తారా అనే ప్రశ్నను సభలో లేవనెత్తారు. మనీష్‌ తివారీ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాలను షా తోసిపుచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దుకు కాంగ్రెస్‌ అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్‌ చేశారు. చట్ట ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని షా స్పష్టం చేశారు..
చదవండి: మోదీ వల్లే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం!!

అయితే ఆంధ్రప్రదేశ్‌ను చట్ట ప్రకారమే విభజించామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ ఇప్పుడు కశ్మీర్‌పై మాట్లాడం సరికాదని హితవుపలికింది.
చదవండి: కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

మరిన్ని వార్తలు