‘కేసీఆర్‌, కేటీఆర్‌ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’

3 Sep, 2019 15:36 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్‌, కేటీఆర్‌ అసమర్థులని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇచ్చిన ర్యాంకులే దీనికి నిదర్శనమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘20 శాఖల పనితీరుని సమీక్షించిన తెలంగాణ సీఎస్‌ సాగునీటి శాఖకు 8వ ర్యాంక్, విద్యుత్‌ శాఖకు 11వ ర్యాంక్‌, ఐటీ శాఖకు 18వ ర్యాంక్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌ శాఖల పనితీరు ఎంత దారుణంగా ఉందో ఈ ర్యాంకులే చెప్తున్నాయి. మొదటి మూడు ర్యాంకుల్లో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధించిన శాఖలు లేవు.

విద్యుత్ శాఖ రూ.34 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. సాగునీటి రంగం అభివృద్ధిలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. కేటీఆర్ ఇన్నాళ్లు అవార్డులు, రివార్డులు కొనుక్కొని పబ్బం గడుపుతున్నారు. ఆ శాఖలో జరిగిన అవినీతి బయటపడుతుందనే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నియమించడం లేదు. గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా ఈటల నామమాత్రంగానే ఉన్నారు. అన్నీ కేసీఆరే చూసుకున్నారు. వేలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజల మీద భారం వేస్తున్నారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం పూర్తి కాలేదు. శాఖల నిర్వహణలో విఫలం చెందిన కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అన్నారు.

మరిన్ని వార్తలు