18న టీపీసీసీ ‘స్పీకప్‌ తెలంగాణ’ 

13 Jul, 2020 02:01 IST|Sakshi

కరోనాపై ప్రజల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘స్పీకప్‌ తెలంగాణ’పేరుతో ఆన్‌లైన్‌ సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు గాను టీపీసీసీ కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ జూమ్‌ యాప్‌ ద్వారా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

కేబినెట్‌ భేటీ అంటూ ఫాంహౌస్‌కు కేసీఆర్‌.. 
కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని పరిస్థితిని అంచనా వేసి మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ సమావేశం పెడతామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఆ తర్వాత 13 రోజుల పాటు ఫాంహౌస్‌కు వెళ్లడం దురదృష్టకరమని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈనెల 18న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ వంటి అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  

మరిన్ని వార్తలు