ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ ‘సోషల్‌ మీడియా పోరు’

27 May, 2020 05:15 IST|Sakshi

ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు నేరుగా అందించాలని డిమాండ్‌

ఈనెల 28న ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్‌లలో ప్రచారం చేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని రాష్ట్రంలోని పేదల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తేవాలని టీపీసీసీ నిర్ణయించింది. ఏఐ సీసీ ఆదేశాలతో ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా  కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆన్‌లైన్‌ పోరాటం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 10 వేల మంది ఈ సోషల్‌ మీడి యా పోరాటంలో పాల్గొనాలని చెప్పారు. ఆదాయపు పన్ను పరిధిలోనికి రాని ప్రతి కుటుంబానికి రూ.10 వేల నగదును నేరుగా అందించాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని, వలస కార్మికులను నిర్లక్ష్యం చేయవద్దని కోరుతూ పోస్టింగ్‌లు పెట్టాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు వలస కార్మికులు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వీటిని ఫొటోలు, వీడియోల రూపంలో పోస్టు చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు