సిద్ధరామయ్యతో కలిసి పనిచేయలేం

18 Oct, 2019 08:13 IST|Sakshi

ఆయన వైఖరితోనే రాజీనామాల పర్వం

అసమ్మతి నేతల బహిరంగ వ్యాఖ్యలు

సాక్షి బెంగళూరు: కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సిద్ధరామయ్య వైఖరితోనే పార్టీలో చాలామంది నేతలు బయటికి వలస వెళ్తున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యలకు దిగుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు కేసీ రామ్మూర్తి, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ లాడ్‌ కూడా సిద్ధరామయ్య వైఖరి సరిగా లేదనే పార్టీ మారుతున్నట్లు మీడియా ముందు వివరించారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. అయితే రానున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలని సోనియాగాంధీ సూచించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. అంతేకాకుండా టికెట్ల కేటాయింపులో కూడా తుది నిర్ణయం సిద్ధరామయ్యదే అని చెప్పారు. ఈక్రమంలో ఇప్పటికే సిద్ధరామయ్య వైఖరి నచ్చకుండా ఉండే కొందరు నేతలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా అనిల్‌లాడ్‌తో సిద్ధరామయ్య సమావేశమై భవిష్యత్తులో ఉన్నత పదవి ఇస్తామని చెప్పారు. కానీ ఫలించలేదు. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన వారు త్వరలోనే బీజేపీలో చేరేందుకు కూడా చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది.

సోనియాతో సిద్ధూ భేటీ
ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత సిద్ధరామయ్య తొలిసారిగా పార్టీ నాయకురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈమేరకు ఢిల్లీ వెళ్లి ఆమెతో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. రానున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి సిద్ధరామయ్యకు పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళిక రచించాలని సూచించారు. ఆరంభం నుంచి కాంగ్రెస్‌లో సిద్ధరామయ్యకు వ్యతిరేక పవనాలు వీచినా.. పార్టీ అధిష్టానం వద్ద మాత్రం సిద్ధరామయ్య ఇమేజ్‌ తగ్గలేదని చెప్పవచ్చు. సీఎల్పీ నేత, ప్రతిపక్ష నేత, ఐదేళ్లు సీఎం, సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఇలా.. ప్రతి విషయంలో అధిష్టానం గుర్తిస్తూనే ఉంది.   

>
మరిన్ని వార్తలు