కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం.. ఇంకా ఎందరు?

21 Mar, 2018 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద తలలు పక్కకు తప్పుకునే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ముఖ్యనాయకులకు-కార్యకర్తలకు మధ్యనున్న గోడలు కూల్చేయడంతోపాటు యువతకు పెద్దపీట దక్కాలన్న రాహుల్‌ గాంధీ సూచన మేరకు సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. నిన్న గోవా, గుజరాత్‌ పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. నేడు ఉత్తరప్రదేశ్‌ పార్టీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంలో భాగంగా మరిన్ని సంస్థాగత మార్పులు తప్పవని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికి రాజీనామాలు చేసిన ముగ్గురే కాకుండా ఇంకొందరు పీసీసీ చీఫ్‌లు కూడా స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని తెలిపాయి.

ఏపీ, తెలంగాణలోనూ మార్పులు? : సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మారుస్తారా, లేదా అనేది చర్చనీయాంశమైంది. రాజీనామాల విషయంలో ‘వయసు’ ప్రధానాంశం కాబట్టి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డిలకు ఎలాంటి ఢోకా ఉండబోదని సమాచారం.

మరిన్ని వార్తలు