రామ్‌.. నర్మద.. గోమూత్ర

11 Nov, 2018 04:23 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

భోపాల్‌: త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టో ‘వచన్‌ పత్ర’ను శనివారం విడుదల చేసింది. ఈ వచన్‌పత్రలో కాంగ్రెస్‌ ‘రామ్‌–నర్మద–గోమూత్ర’ అంశాలనే ప్రాతిపదికగా తీసుకుంది. వీటి ప్రకారం.. ‘రాష్ట్రంలో ఆధ్యాత్మిక విభాగ్‌ పేరుతో ఆధ్యాత్మిక శాఖ ఏర్పాటు, సంస్కృత భాష వ్యాప్తి, 14 ఏళ్ల అరణ్య వాసం సమయంలో శ్రీరాముడు సంచరించిన ‘రామ్‌ పథ్‌’ అభివృద్ధి, గో మూత్రం, పిడకలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం, ప్రతీ గ్రామంలో గోశాల, హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నదీ పరిరక్షణకు చర్యలు, నర్మద తీరాన ఉన్న పుణ్య క్షేత్రాల అభివృద్ధికి రూ.1,100 కోట్ల నిధుల కేటాయింపు వంటివి ఉన్నాయి.

వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించే ‘వ్యాపమ్‌’ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ సంస్థ నిర్వహించిన పలు పరీక్షలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యాపమ్‌ బదులు మరో సంస్థను ఏర్పాటుచేసి అవినీతికి తావులేని విధంగా పరీక్షలను నిర్వహణ,  70శాతం మార్కులు సాధించే 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని పేర్కొంది. కళాశాల విద్యార్థినులకు సబ్సిడీపై సైకిళ్లు ఇస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు