సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్‌ బాసట

25 Jun, 2018 12:05 IST|Sakshi

న్యూఢిల్లీ : విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ బాసటగా నిలిచింది. ఓ హిందు- ముస్లిం జంటకు పాస్‌పోర్ట్‌ జారీకి నిరాకరించి వివాదంలో చిక్కుకున్న వికాస్‌ మిశ్రా అనే అధికారిని బదిలీ చేయడంపై నెటిజన్లు సుష్మాపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కాంగ్రెస్‌ తాజాగా స్పందించింది. ఈ అంశంలో తాము సుష్మా నిర్ణయానికి మద్దతు పలుకుతున్నట్టు ట్విటర్‌లో పేర్కొంది. ఈ విషయంలో సుష్మాని నిందించడానికి, అగౌరవపరచడానికి ఎలాంటి అస్కారం లేదని అభిప్రాయపడింది. సొంత పార్టీకి చెందిన వ్యక్తులే విమర్శలు గుప్పిస్తున్నప్పటికి.. సుష్మా నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామని తెలిపింది.  

కాగా, లక్నోకు చెందిన మహ్మద్‌ అనాస్‌ సిద్ధిఖీ, తన్వీ సేథ్‌ దంపతులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోగా అధికారి వికాస్‌ మిశ్రా అనాస్‌ను పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారు. దీనిపై బాధితులు సుష్మాకు ఫిర్యాదు చేయగా.. ఆమె వెంటనే స్పందించి పాస్‌పోర్టు మంజూరు చేయించారు. అంతేకాకుండా వికాస్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. సుష్మా తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఏకంగా ఇటీవల మీకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు.. ఇది మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమా అంటూ ప్రశ్నించాడు.  

మరిన్ని వార్తలు