రోషన్‌ బేగ్‌ను సస్పెండ్‌ చేస్తూ అధిష్టానం నిర్ణయం

19 Jun, 2019 09:39 IST|Sakshi

బెంగళూరు : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను సీనియర్‌ నాయకుడు రోషన్‌ బేగ్‌ను సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) నాయకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్‌ బేగ్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన రోషన్‌ బేగ్‌.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు’ ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రోషన్‌ బేగ్‌ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో​ కర్ణాకటలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో రోనేష్‌ బేగ్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ తిట్టిపోశారు. ఇదే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఏ జ్యువెల్స్‌ స్కామ్‌లో రోషన్‌ బేగ్‌ భాగస్వామి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు