‘టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’

9 Nov, 2018 05:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌ కుమార్‌కు గురువారం టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో సీఈఓకు ఫిర్యాదుచేశామని టీఆర్‌ఎస్‌ నేతలు గట్టు రాంచంద్రారావు, ఉపేందర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ ఏర్పడితే హరీశ్‌ సీఎం అవుతారని రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి కల్పించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్‌రావు తనకు ఫోన్‌ చేసినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని తప్పుబట్టారు. నర్సాపూర్‌ ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సీఎం పదవిని గౌరవించకుండా మీడియాలో ప్రచురించలేని బూతులు మాట్లాడారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు