-
అమరావతికే పరిమితమైన యనమల
రాజప్ప స్పందన ఫొటో పోజులతో సరి
ఆపత్కాలంలో ఆదుకోవాలన్న ధ్యాసే లేదని ప్రజల విమర్శ
సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా.. ఆపద వేళ ప్రజలను ఆదుకున్న వారే అసలైన నాయకులు. అటువంటి వారిని ప్రజ లు పార్టీలతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటారు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నామని, ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని తరచూ గర్వంగా చెప్పుకొంటూ కాలరెగరేసే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ చిన్న విషయాన్ని మరచినట్టున్నారు. కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు లాక్డౌన్ విధించిన ప్రభుత్వాలు.. కూలి లేక.. కూటికి నోచుకోక అల్లాడుతున్న ప్రజలకు ఇతోధికంగా సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వాలు, పలు సంస్థలతో పాటు పలువురు దాతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కూడా తమకు తోచిన రీతిలో నిత్యావసరాలు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కుల వంటివి అందిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నారు.
ప్రజలను వదిలేశారిలా..
‘ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ప్రస్తుత కరోనా విపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దీనిని అక్షరాలా ఆచరిస్తున్న వారు ఎందరో కనిపిస్తున్నారు. స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగినట్టు ‘బాధాసర్పదషు్టల’కు మనసారా సాయం అందిస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు కదులుతున్నారు. ఇటువంటి ఆపద సమయంలో ప్రజలకు అన్నివిధాలా అండగా ఉండాల్సిన ‘పచ్చ’ నేతలు మాత్రం దాదాపు పత్తా లేకుండా పోయారు.
మానవాళిని కబళించేందుకు వేయి తలల విషనాగులా బుసలు కొడుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. ఇళ్లల్లోనే ‘లాక్’ అయ్యి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో కృషి చేస్తూంటే.. దానిని చూడలేక.. మీడియా ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒడ్డున కూర్చుని విమర్శల రాళ్లు విసురుతున్నారు. తద్వారా తమకు దూషించే నోళ్లే తప్ప.. సాయం చేసే చేతులు లేవన్న విషయాన్ని నిరూపించుకుంటున్నారు.
దోచుకుని.. దాచుకుని..
గత ప్రభుత్వ హయాంలో ఇటు తుని నుంచి అటు రాజోలు వరకూ.. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణా, వివిధ పనుల్లో పర్సంటేజీలు నొక్కేసి వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అక్రమంగా ఆర్జించిన సొమ్ములను ఓట్ల కోసం ఎన్నికల్లో కుమ్మరించి, ప్రలోభాలతో కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. నిరంతరం ‘ప్రజలే దేవుళ్లు’ అని చెప్పుకొనే టీడీపీ నాయకులు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యతను వారు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి ఓటేస్తే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కనీసం సాంత్వన కల్పించలేని నాయకులు భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకుని వస్తారని జిల్లా ప్రజలు
ప్రశ్నిస్తున్నారు.
అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు
టీడీపీ నేతల తీరుకు పూర్తి భిన్నంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ వేళ ప్రజలకు తోచిన సాయం చేస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు. తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 14 లక్షల పై చిలుకు కుటుంబాలకు వెయ్యి రూపాయలు, బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసి భరోసా కల్పించింది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులూ ప్రజలకు ధైర్యం చెబుతూ, దగ్గరుండి మరీ వారి బాగోగులు చూసుకుంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మం్రత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్రామ్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ యంత్రాంగం యావత్తూ నిత్యం ప్రజలతోనే ఉంటూ వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, యువత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా చీమ కుట్టినట్టయినా చలించని టీడీపీ నేతల తీరును జిల్లా ప్రజలు ఆక్షేపిస్తున్నారు.