‘మంచి చేయకున్నా పర్లేదు.. భయపెట్టొద్దు’

28 Apr, 2020 13:40 IST|Sakshi

చంద్రబాబుపై మంత్రి అనిల్‌ కుమార్‌ విమర్శలు

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా క్లిష్ట సమయంలో చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనలాంటి ప్రతిపక్షనేత ఉండటం దురదృష్టకరం అన్నారు. కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ మెరుగ్గా ఉందన్నారు. దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. మొత్తం టెస్టుల్లో దేశవ్యాప్తంగా 4.5 కేసులు నమోదవుతోంటే.. ఏపీలో అతి తక్కువగా 1.5 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు.
(చదవండి: ‘ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండి’)

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. చంద్రబాబు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలను భయపెట్టొద్దు. కర్నూలు ఎంపీ ఇంట్లో నలుగురు డాక్టర్లకు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారు. వారు డాక్టర్లు, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. అటువంటి వారిని అభినదించాలి. వారిని కించ పరచడం సరికాదు. చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టు కిట్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా విమర్శలు చేయడంలో అర్ధం లేదు.

మా ప్రభుత్వం కరోనా కేసులు దాస్తోందని యనమల రామకృష్ణుడు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. టీడీపీ నేతలు తిన్నది అరక్క 12 గంటలు దీక్షలు చేస్తున్నారు. ఏ ఒక్క టీడీపీ నేత అయినా ప్రజలకు సహాయం చేసారా. చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు మాట్లాడే హక్కు లేదు. రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఉండడానికి మాత్రం హైదరాబాద్ కావాలా’అని మంత్రి అనిల్‌ కుమార్‌ విమర్శలు గుప్పించారు.
(చదవండి: మా కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా)

మరిన్ని వార్తలు