వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధిస్తే..ఊరుకునేది లేదు

19 Apr, 2018 10:40 IST|Sakshi
దొర్రపల్లె రచ్చబండలో మాట్లాడుతున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

దొర్రపల్లె రచ్చబండలో టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే బుగ్గన

డోన్‌ :  అవినీతి మయమైన టీడీపీ పాలనను  వచ్చే ఎన్నికల్లో ఓటుతో అంతం చేద్దామని   పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ  (పీఏసీ) చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని దొర్రపల్లె గ్రామంలో బుధవారం రచ్చబండ కార్యక్రమం  నిర్వహించారు.   గ్రామస్తులతో మాట్లాడి వారి  సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.   దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనను తిరిగి రాష్ట్రంలో తెచ్చుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిందని.. నాలుగేళ్లలో అవినీతి, దౌర్జన్యం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రతి పథకంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తలదూర్చి దండుకుంటున్నారని ఆరోపించారు.  రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు, గృహనిర్మాణ పనుల్లో మామూళ్ల కోసం పేదలను పట్టిపీడిస్తున్నారన్నారు. రైతుల కందుల కొనుగోళ్లలో సైతం కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. వంకలు, వాగులు, నదుల్లో  ఇసుకను తోడేస్తున్నారని చెప్పారు.   
వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధిస్తే సహించను 
అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ  నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే సహించనన్నారు. తన సహనానికి ఒక హద్దు ఉంటుందనే విషయాన్ని  గ్రహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు దేవేంద్ర, రాజేంద్రప్రసాద్, తిప్పన్న, చంద్ర, రంగడు, శ్రీను, సెంట్రింగ్‌ శ్రీను, వెంకటేశ్వర్లు, హరిశ్చంద్ర ఎరుకలి ప్రసాద్, సీతారామయ్య, కోటేశ్వరరావ్, శ్రీనివాసులు, సుధాకర్, లక్ష్మన్న, పెద్దబూసి, రమణ, రాముడు పాల్గొన్నారు. అంతకు ముందు   పార్టీ గ్రామ నాయకులు చిరంజీవి, వెంకటేశ్వర్లు, ఆనంద్, రాజబాబు, ప్రకాశం, రాంబాబు, దశరథరాముడు, కిరణ్‌ కుమార్, కల్యాణ్, రాజశేఖర్, రాజు, గోపాల్, శంకర్, రఘు, రాము, రాజేష్, దేవేంద్రల ఆధ్వర్యంలో యువకులు బుగ్గనకు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు