గుండె గు‘బిల్లు’!

20 Jun, 2018 03:26 IST|Sakshi

     అవినీతి చీకట్లో విద్యుత్‌ రంగం 

     నాలుగేళ్లల్లో మూడుసార్లు చార్జీల పెంపు 

     ప్రత్యక్షంగా రూ.1,787 కోట్లు.. పరోక్షంగా రూ.2,800 కోట్ల వడ్డన 

     దొడ్డిదారిన పిండుకునే పథకాలకు శ్రీకారం 

     ప్రైవేటు కాంట్రాక్టులతో దోపిడీ 

     అవసరం లేకున్నా అడ్డగోలుగా విద్యుత్‌ కొనుగోళ్లు 

     ప్రతీ కాంట్రాక్టులోనూ పర్సంటేజీలు 

     సోలార్‌.. బొగ్గులోనూ దండిగా ముడుపులు 

సాక్షి, అమరావతి: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్‌ రంగంపై చిమ్మచీకట్లు అలుముకున్నాయి. బిల్లులు తగ్గిస్తామని చెప్పిన మాట దేవుడెరుగు.. ఈ నాలుగేళ్లల్లో పేదవాడి కరెంట్‌ బిల్లులు నాలుగు రెట్లు పెరిగాయి. అవసరం లేకున్నా ప్రైవేటు విద్యుత్‌ను కొన్నారు. వేల కోట్లు దోచుకున్నారు. ఏపీ జెన్‌కో ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీశారు. బొగ్గు దగ్గర్నుంచి, థర్మల్‌ కాంట్రాక్టుల వరకూ.. ట్రాన్స్‌కో లైన్ల దగ్గర్నుంచి సోలార్‌ ప్లాంట్ల వరకూ ఇష్టారాజ్యంగా దోపిడీ కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది.  

రాష్ట్రంలో ఈ నాలుగేళ్ల కాలంలో మూడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. దీంతో ప్రజలపై పడిన ఈ భారం రూ.1,787 కోట్లు. 2015–16లో రూ.800 కోట్లు, 2016–17లో రూ.745 కోట్లు, 2017–18లో రూ.242 కోట్ల మేర విద్యుత్‌ చార్జీలు పెంచారు. ఇవి ప్రత్యక్షంగా పెరిగినవి మాత్రమే. ఇక పరోక్షంగా ప్రజల నుంచి మరో రూ.2,800 కోట్లు పిండుకుందీ ప్రభుత్వం. అంతేకాదు.. 2016– 17లో శ్లాబుల వర్గీకరణ (క్రితం ఏడాది 900 యూనిట్లు కాల్చిన వారిని అధిక టారిఫ్‌లోకి తేవడం) వల్ల 70 లక్షల మందిపై అదనపు భారంవేసి, రూ.1,200 కోట్ల మేర దొంగ దెబ్బ కొట్టింది. అలాగే, 2017–18లో డిమాండ్‌ చార్జీలు పెట్టి రూ.900 కోట్ల మేర పరోక్ష వడ్డన చేసింది. 2018–19లో ఇంకో రూ.700 కోట్ల మేర పరోక్ష రాబడికి పూనుకుంది.  

రైతన్నకూ టోకరా.. 
దివంగత మఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. 2014 నాటికి రాష్ట్రంలో 16 లక్షల వ్యవసాయ పంపు సెట్లున్నాయి. ఈ నాలుగేళ్లల్లో ఏటా సగటున 75వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం నాలుగేళ్లల్లో కేవలం 50 వేల పంపుసెట్లు మంజూరు చేసింది. వీటిల్లో చాలావరకూ సోలార్‌ పంపుసెట్ల వైపు మళ్లించింది.తాము అధికారంలోకి వస్తే ఏడుకు బదులు 9గంటలపాటు పగటిపూట విద్యుత్‌ ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. నాలుగేళ్లుగా కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వడంలేదు. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించిన నివేదికల ప్రకారం ఏటా వ్యవసాయానికి కేవలం 9 వేల మిలియన్‌ యూనిట్లు కేటాయిస్తోంది.

ఇంత మొత్తానికే సబ్సిడీ మంజూరు చేస్తోంది. నిజానికి 16 లక్షల పంపుసెట్లకు రోజుకు ఏడు గంటల విద్యుత్‌ ఇస్తే ఏడాదికి 16,280 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం కేవలం 9 వేల మిలియన్‌ యూనిట్లే ఇస్తోంది. దీన్నిబట్టి రోజుకు కేవలం 4 గంటలకు మించి వ్యవసాయ విద్యుత్‌ ఇవ్వడంలేదని స్పష్టమవుతోంది. అలాగే, దళితుల ఉచిత్‌ విద్యుత్‌ కనెక్షన్లను కుదించింది. మొత్తం 14 లక్షల దళిత కుటుంబాలకుగాను 8.5లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను నిలిపివేసింది. ఈ పథకానికి దాదాపు రూ.900 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని పంపిణీ సంస్థలు పట్టుబడితే కేవలం రూ.124 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.  

మిగులు పేరుతో దోపిడీ 
రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉందని, దీన్ని అధిగమించి ఏడాదికి 10 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ సాధించా మని ప్రభుత్వం చెబుతోంది.దీన్ని సాకుగా చూపించి అవసరంలేకున్నా అధికరేట్లకు ప్రైవేటు విద్యుత్‌ కొను గోళ్లను ప్రోత్సహించింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 1,600 మెగావాట్ల కృష్ణపట్నం, 600 మెగావాట్ల ఆర్టీపీపీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు.. ఏడాదికి రాష్ట్ర విద్యుత్‌ వినియోగం 49 వేల మిలియన్‌ యూనిట్లు దాటడంలేదు. కానీ, పరిశ్రమలు వస్తాయని, డిమాండ్‌ పెరుగుతుందని ఏడాదికి 65 వేల మిలియన్‌ యూనిట్లకు లెక్కగట్టింది. దీనికోసం  తనకు నచ్చిన,  కమీషన్లు ఇచ్చే ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను అ«త్యధికంగా కొనుగోలు చేసింది. అలాగే, మార్కెట్లో యూనిట్‌ రూ.2కు లభిస్తున్నా, విద్యుత్‌ సంస్థలు సగటున యూనిట్‌ రూ.5పైనే కొనుగోలు చేశాయి. రాష్ట్రానికి అవసరమైన  49 వేల మిలియన్‌  యూనిట్లలో  38,325 మిలియన్‌ యూనిట్లను ఏపీ జెన్‌కో థర్మల్, హైడల్‌ ద్వారా అందుకునే వీలుంది. ఈ విద్యుత్‌ సగటున రూ.4 లోపే లభిస్తుంది. కానీ, జెన్‌కో విద్యుత్‌ను ఏటా    సగటున  22వేల  మిలియన్‌  యూనిట్లకే  పరిమితం  చేసి ప్రతీఏటా  25 వేల మిలియన్‌ యూనిట్ల మేర ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. దీనివల్ల ఏటా రూ.12వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది.

బొగ్గునూ వదల్లేదు.. 
2014లో విదేశీ బొగ్గు కాంట్రాక్టులను పొడిగిం చడం, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు తగ్గినా పాత రేట్లకే కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలున్నాయి. దాదాపు 3.5 మిలియన్‌ టన్నుల బొగ్గును అవసరం లేకున్నా ఆర్డర్లు ఇవ్వడంవల్ల రూ.755 కోట్ల మేర అవి నీతి జరిగిందనే విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కృష్ణపట్నంకు లక్ష టన్నుల బొగ్గు ఆర్డర్లు ఇవ్వడం, మరికొన్ని ప్లాంట్లకూ విదేశీ బొగ్గు దిగుమతికి జరిగిన గోల్‌మాల్‌లో రూ.400 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలున్నాయి. 

ప్రతీ ప్రాజెక్టులోనూ ముడుపులే.. 
- 2015లో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు (టాటాకు), నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు (బీజీఆర్‌) 800 మెగావాట్ల విస్తరణ కాంట్రాక్టుల్లో రూ.2,600 కోట్ల మేర ఎక్కువ అంచనాలు వేసి దోచుకున్నట్టు తీవ్ర ఆరోపణలొచ్చాయి.  
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో మెగావాట్‌ రూ.5.8 కోట్లకే ఈపీసీ కాంట్రాక్టులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఇదే తరహా ప్రాజెక్టులకు ఏకంగా మెగావాట్‌కు రూ.6.2 కోట్ల మేర కట్టబెట్టింది. పైగా ఈ రెండు సంస్థలకే కాంట్రాక్టులు ఇచ్చేందుకు వారికి అనుకూలంగా నిబంధనలు పెట్టడం విమర్శలకు దారి తీసింది. అలాగే.. 
అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏర్పాటుచేసిన 500 మెగావాట్ల సోలార్‌ కాంట్రాక్టు పనుల్లోనూ రూ.500 కోట్ల మేర చేతివాటం బహిర్గతమైంది. ఇక్కడ ఎన్టీపీసీ నిబంధనలకు విరుద్ధంగా మూడు కాంట్రాక్టు సంస్థలకు అధిక రేట్లకు కాంట్రాక్టు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది.  
ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్ల ఏర్పాట్లలో అంతులేని అవినీతి తేటతెల్లమైంది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. నన్నూరు–జమ్మలమడుగు 400 కేవీ లైన్‌కు సంబంధించి రాయి పడినట్టు టాటా సంస్థ తప్పుడు బిల్లులు పెట్టింది. రూ.10 కోట్ల అవినీతిలో పెద్దల భాగస్వామ్యం ఉందని విజిలెన్స్‌ విభాగం కూడా నిర్థారించింది.  
ప్రైవేటు పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతిపై బాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ లేకున్నా 2 వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్‌ను ఏకంగా 25 ఏళ్లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, దీనివల్ల రూ.35వేల కోట్ల నష్టం జరుగుతుందని విద్యుత్‌ వర్గాలు ఏపీఈఆర్‌సీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. మొదట్లో ఈ విద్యుత్‌ వద్దంటూ అభ్యంతరం చెప్పిన ప్రభుత్వం.. మూడు నెలల్లోనే మళ్ళీ కావాలని ఏపీఈఆర్‌సీకి తెలపడం విశేషం. సీఎంతో రాయబారం జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.  

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు షాక్‌ కొడుతున్నాయి. అధికారంలోకి వస్తూనే కరెంట్‌ చార్జీలు తగ్గిస్తాను.  
– 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు.. 

ఎన్నికలకు ముందు ఒక్కో ఇంటికీ రెండు నెలలకు రూ.100 కరెంట్‌ బిల్లు వచ్చేది. ఇప్పుడు నెలనెలా ఒక్కో ఇంటికీ రూ.500 నుంచి రూ.3వేల దాకా బిల్లు వస్తోంది. నేరుగా కొంత.. దొడ్డిదారిన మరికొంత విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు.  
– అధికారంలోకి వచ్చిన తర్వాత.. 

మరిన్ని వార్తలు