నన్నెవరూ బెదిరించలేదు: షరీఫ్‌

23 Jan, 2020 19:09 IST|Sakshi

సాక్షి, తణుకు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తనను ప్రలోభాలకు గురిచేశారంటూ వస్తున్న వార్తలను శాసనమండలి చైర్మన్‌ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా షరీఫ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలు చేయలేదని స్పష్టం చేశారు. తనను మంత్రులు దుర్భాషలాడినట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అదేవిధంగా వారు తనని బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. మూడు రాజధానులు రావాలా, అమరావతి ఒక్కటే ఉండాలా అన్నదానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తేల్చిచెప్పారు. శాసనమండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ.. అది ప్రభుత్వం ఇష్టమని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు