ఎన్నికల ఫలితాలు జాప్యమైనా సరే..

8 Apr, 2019 09:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈవీఎం ఫలితాలతో 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చేందుకు ఓకే అంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆర్రోజుల సమయం పట్టినా పర్లేదని ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతినడం లేదని ఈసీ తమకు భరోసా ఇవ్వగలిగితే చాలన్నారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంల ఫలితాలతో సరిపోల్చడం వల్ల ఫలితాల వెల్లడికి 5.2 రోజుల వరకు ఆలస్యమవుతుందన్న ఈసీ వాదనపై ఈ మేరకు 22 ప్రతిపక్ష పార్టీలు కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశాయి.

ధర్మాసనం దీనిపై సోమవారం వాదనలు విననుంది. ప్రస్తుత విధానంలో అసెంబ్లీ నియోజకవర్గంలోనైతే ఒక పోలింగ్‌ బూత్, లోక్‌సభకైతే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఒక పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్‌లతో సరిపోల్చి చూస్తున్నారు. కనీసం 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చేలా ఈసీని ఆదేశించాలంటూ పార్టీలు కోర్టును ఆశ్రయించడం తెల్సిందే.  

మరిన్ని వార్తలు