వైఎస్‌ఆర్‌సీపీ మహాధర్నాకు పలువురు నేతల సంఘీభావం

5 Mar, 2018 13:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మహాధర్నాకు పలువురు ఇతర పార్టీల నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆప్‌ నేత రామారావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు సదాశివారెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తదితరులు సంసద్‌మార్గ్‌లో కొనసాగుతున్న మహాధర్నాలో పాల్గొని.. వైఎస్‌ఆర్‌సీపీ పోరాటానికి అండగా నిలబడారు. అనంతరం సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు కూడా మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

 ప్రత్యేక హోదా మన హక్కు అని, ప్రత్యేక హోదాను సాధించే పోరాటంలో అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. అందరూ కలిసి పోరాడితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని అన్నారు. ఏపీకి హోదా రాకపోవడానికి మొదట ద్రోహి కేంద్ర ప్రభుత్వం, రెండో ద్రోహి రాష్ట్ర ప్రభుత్వమని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. ఈ రెండు ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెప్పాలని మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్‌ ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు