అమిత్‌ షా ఎందుకు కరెక్టో పవన్‌ చెప్పాలి!

4 Dec, 2019 16:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను, బీజేపీ నేతలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకు పొగుతున్నారో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  అమిత్‌ షా ఎందుకు కరెక్ట్‌ అనేది పవన్‌ సమాధానం చెప్పాలని అన్నారు. రాజకీయ విలువలకు తూట్లు పోడిచినందుకు అమిత్‌ షా కరెక్టా? లేక ఎమ్మేల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కరెక్టా? అని ప్రశ్నించారు. అలాగే ప్రాంతీయ పార్టీల నేతలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అమిత్‌ షాను చూసి భయపడుతున్నారని ఆయన విమర్శించారు. వెన్నుముక లేని వ్యక్తులుగా వారు వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ నేతలు చెప్పారా? అని  ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిందిపోయి పవన్‌ అమిత్‌ షాను పొగడటం ఏంటి? అని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న  అమిత్‌ షా కరెక్ట్‌ అని వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదని రామకృష్ణ అన్నారు.  

మరిన్ని వార్తలు