చీవాట్లుపెడుతున్నా బుర్రకెక్కడంలేదు

16 Oct, 2017 16:45 IST|Sakshi

విజయవాడ: అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు నిర్వహిస్తున్న మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలు తీర్చకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితుల సమస్యలపై కోర్టులు సైతం చీవాట్లుపెడుతున్నాప్రభుత్వాలకు బుర్రకెక్కడంలేదని మండిపడ్డారు. నిర్వాసితులు సంతృప్తి చెందకుండా ప్రాజెక్టు పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు.

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడేందుకు వెళ్లిన వామపక్ష నేతలను అడ్డుకుని అరెస్ట్ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వంశధార ప్రాంతం ఏమైనా పాకిస్థానా.. ఎందుకు నిర్బంధం విధిస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మాత్రం రాజకీయ వారసత్వం కోరుకోవచ్చు, నిర్వాసితులు మాత్రం భూమిపై హక్కు కోరితే చెల్లదంటున్నారని అన్నారు. మీకో నీతి, వారికో నీతా? అని సూటిగా అడిగారు.

మరిన్ని వార్తలు