సాక్షి, విజయవాడ : బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రం బిల్లులు ప్రవేశపెడుతోందని మండిపడ్డారు. శనివారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. టెర్రరిజానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని, టెర్రరిజం పేరుతో ఒక మతాన్ని టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మోదీ, అమిషా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆర్థిక నేరగాళ్లకు కొమ్ము కాసేందుకు కొత్త చట్టాలు తెస్తున్నారని, నిర్మలా సీతారామన్ చాలా కమ్మగా అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయిదేళ్ల పాలనలో టీడీపీ వ్యవహరించిన విధానాల వల్లే రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టారని విమర్శించారు. చంద్రబాబు డిజైన్ల ప్రకారం అమరావతి నిర్మించాల్సిన అవసరం లేదని, తక్కువ వ్యయంతోనే అమరావతిలో రాజధాని నిర్మించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృషి చేయాలని కోరారు.