‘మోదీ ప్రధానిగా ఉండటం మన దురదృష్టం’

2 Jan, 2019 15:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఉండటం దేశ ప్రజల దురదృష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ అనటం బాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు తీసుకుంటున్నారని తెలిపారు. రుణమాఫీ చేయకుండా ఉండటానికే మోదీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా సాధన, కేంద్ర వైఖరికి నిరసనగా  రేపు, ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, మేధావులు విభజన హామీలు అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. 

పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ కనీసం ఐదేళ్లు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు 15 వందల కోట్ల రూపాయలే ఇచ్చిందని తెలిపారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. రెవెన్యూ లోటు 16వేల కోట్లు ఉందంటే.. కేవలం మూడున్నర వేల కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు